అనంతపురం, మన న్యూస్:కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం మౌన ప్రదర్శనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్ర రెడ్డి గారు, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కొనకొండ్ల రాజేష్ గారు, జిల్లా బీజేపీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, యువత వీరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతుబజార్ నుంచి గడియార స్తంభం వరకు సాగిన ర్యాలీలో నినాదాలు, జాతీయ భావోద్వేగాలతో ఊపొచ్చింది. యువకులు, మహిళలు, బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత,” అని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రతి సైనికుడి పాత్ర అమూల్యమని, వారి త్యాగాలను భావితరాలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *