

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యం ను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని,అదే సమయంలో ట్యాబ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు రబీ సీజన్ లో జొన్న పంట సాగుచేస్తామని, నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికీ సాగు,త్రాగు నీటికి ఉపయోగంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ, బోరు బావుల్లోని నీరు తాగుతున్నమని తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేల్గనూర్ గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ , జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు,తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, సొసైటీ చైర్మన్ నరసింహా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఏఈఓ స్వర్ణలత,రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
