

మన న్యూస్,తిరుపతిః– రాజకీయ లబ్ది కోసం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్లరి మూకల జేజేల కోసం తన కారు కింద పడి కార్యకర్త ప్రాణాలు పోతున్నా పక్కకు లాగి పడేసి సింగయ్య చావుకు జగన్మోహన్ రెడ్డి కారకుడైయ్యారని ఆయన తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు. సింగయ్య కుంటుంబాన్ని పరామర్శించక పోవడంతోపాటు మరో కార్యకర్త గుండెపోటుతో మృతి చెందితే పట్టించుకోని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తల ప్రాణాలకు విలువ ఇవ్వని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. పరామర్శకు వెళ్ళే ముందు పోలీసుల సూచనలను జగన్ పక్కన పెట్టి బలప్రదర్శనకు దిగుతుండటంతో కార్యకర్తల ప్రాణాలు పోతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరుల నుంచి ప్రజలకు భద్రత అవసరమని ఆయన చెప్పారు. ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తే తొక్కినారతీస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు.
ఉనికి కోసమే కరుణాకర్ రెడ్డి విమర్శలు: ఆరణి శ్రీనివాసులు తాను కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిరూపించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకే కరుణాకర్ రెడ్డి టిటిడిపైనా, ఎన్డీఏ కూటమిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైన్ షాపులు గత ప్రభుత్వ హయాంలో 24గంటలు ఓపెన్ చేసి నాసిరకం మద్యం అమ్మిన చరిత్ర కరుణాకర్ రెడ్డి మరిచిపోయినా ప్రజలు మరిచి పోలేదని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిపాలన భవనం పెండింగ్ పనుల పూర్తికి చాణిక్య లాడ్జీ స్థలాన్ని అమ్మాలని ఎవరికీ లేదన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై కమిటీ వేసి ఆ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెబితే వైసిపి కార్పోరేటర్లే బల్లలు చరిచి మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. వైసిపి కార్పోరేటర్లకు తాను వత్తాసు పలక లేదన్నారు. కరుణాకర్ రెడ్డి వైఖిరితోనే వైసిపి కార్పోరేటర్లు జనసేన, టిడిపిలోకి వచ్చారని ఆయన తెలిపారు. టౌన్ బ్యాంక్ లో జరిగిన అక్రమాలపై అధికారుల కమిటీ విచారణ చేపట్టిందని, కొందరు డైరక్టర్లు అప్రూవర్స్ గా మారి నిజాలు చెప్పారని ఆయన చెప్పారు. త్వరలోనే బ్యాంక్ డబ్బు దోచుకున్నావాళ్ళు శిక్షను అనుభవిస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నగర అధ్యక్షలు రాజా రెడ్డి, బాబ్జీ, మునస్వామి, ఆకేపాటి సుభాషిణి, అనీల్ రాయల్, హేమకుమార్, వెంకటేష్, జానకిరామ్, పగడాల మురళీ, రాధా తదితరులు పాల్గొన్నారు.