

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మునీశ్వర్ రెడ్డి మాట్లాడారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి నియోజకవర్గం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ నిధులను వెనక్కి ఇవ్వమని ఈశ్వర్ రెడ్డి అడుగుతారా అని ప్రశ్నించారు. రేణిగుంటలో కూడా కూడా నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో రెండు కోట్లతో ఆరనియర్ పార్కును తుడా నిధులతోనే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తుడా నిధులతో 11 పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండా 12 ఇండోర్ స్టేడియం లను నిర్మించడం జరిగిందన్నారు. తుమ్మలగుట్ట లోని కె.వి.ఆర్ పార్కు గురించి తాము మాట్లాడినప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉలిక్కి పడ్డారని ఈశ్వర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుమ్మలగుంటలో పార్కును గ్రామపంచాయతీ లోని అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పంచాయతీ ప్రజలకు పూర్తి హక్కులు దానిపై ఉన్నాయన్నారు. పార్టీలకతీతంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గమంతా అభివృద్ధి చేశారని చెప్పారు. ఇకనైనా ఈశ్వర్ రెడ్డి తో పాటు తిరుపతి రూరల్ మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని, తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ మండలాధ్యక్షులు మూలం చంద్రమోహన్ రెడ్డి, రూరల్ మండలం వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, పేరూరు సర్పంచు దామినేటి కేశవులు, వెంకటపతి నగర్ సర్పంచ్ చిన్ని యాదవ్ పాల్గొన్నారు.