

మన న్యూస్ పాచిపెంట, జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పోడు వ్యవసాయంలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువులే బాగా పని చేస్తాయని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు హితవు పలికారు.చిట్టెలుభ, శతాభి గిరిశిఖర గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా నేలలో వేసే నత్రజని ఎరువులు 30 శాతం కు పైగా నీటి ద్వారా ఆవిరి ద్వారా వివిధ రూపాలలో నష్టపోయి పంటకు అందకుండా పోతుందని,పోడు భూములలో మట్టి సాంద్రత తక్కువగా ఉండడం వలన ఈ నష్ట స్థాయి మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి పోడు మొక్కజొన్న పత్తి పంటలలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువుల పిచికారి ద్వారా అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చని తెలిపారు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు నేలలో వేస్తే రైతు మిత్రుడుగా పిలవబడే వానపాములు పూర్తిగా నశించిపోతాయని అలాగే గడ్డి మందులు పిచికారి ద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవులు పూర్తిగా నశించిపోతాయని దీనివలన సేంద్రియ పదార్థం క్రమంగా తగ్గిపోయి నేలలు నిస్సారం అయిపోతాయని కాబట్టి రైతులు పంట కొంచెం ఎదిగిన తర్వాత నానో డి ఏ పి నానో యూరియా వంటివి ఎకరానికి 500 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఏదైనా పురుగు మందులో కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నానో ఎరువులతో పాటుగా ఆకుల ద్వారా పంట లోనికి త్వరగా శోషించబడి ఆ పురుగుమందుల యొక్క ప్రభావం పెరుగుతుంది అని తెలిపారు. అనంతరం అధిక యూరియా వేస్తే వానపాములు ఎంత త్వరగా చనిపోతున్నాయో ప్రత్యక్షంగా రైతులకు చూపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శతాభి సర్పంచి రామయ్య గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ ఉమామహేశ్వరి సదాభి పంచాయతీ సెక్రటరీ ఉదయ్ కుమార్ మహిళా పోలీస్ కుమారి హాజరయ్యారు.
