

మన న్యూస్,తిరుపతి రూరల్ :- విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ సమావేశానికి రూరల్ మండలాధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ చెరకుల జనార్దన్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే గురువులు తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా విని ఉన్నత చదువులు చదివి లక్ష్యానికి చేరుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, విద్యార్థులు చిన్నప్పటినుంచి క్రీడల పట్ల దృష్టి సారించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు. చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత మానసిక ప్రశాంతత అలబడుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మూలం చంద్రమోహన్ రెడ్డి పలకలు, నోటి పుస్తకాలు పంపిణీ చేశారు. సమస్యల వలయములో ప్రభుత్వ పాఠశాల… అగ్రహారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సందర్భంగా పాఠశాలల్లోని పలు సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు కావలసినన్ని తరగతుల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు ఆదనపు గదులు కావాలని కోరారు. మరుగుదొడ్లు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ విషయాన్ని గతంలో పలుమార్లు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి సర్పంచ్ నేతృత్వంలో తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. ప్రాథమిక పాఠశాల రోజురోజుకు శిథిలం అవుతోందని వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు స్పందించిన మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి వెంటనే సమస్యలు అన్నింటిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
