పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్ల హాజరు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
ఎన్నికల సమయంలో బెదిరింపులు, దాడులు, గుంపులుగా తిరగడం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా.
ప్రతి రౌడీషీటర్ కదలికలపై పోలీసుల నిరంతర పర్యవేక్షణ.
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు.
తిరుపతి, జులై 19:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సీఐ కార్యాలయంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లను పిలిపించి పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించినా, దాడులు, వసూళ్లు, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి రౌడీషీటర్ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ సందేశం:
“తిరుపతి జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై రాజీపడే ప్రసక్తే లేదు. ఎన్నికల వేళ ప్రతి ఓటరు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా పూర్తి భద్రత కల్పిస్తాం. రౌడీషీటర్లు చట్టాన్ని అతిక్రమిస్తే పాత చరిత్రను బట్టి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ నిరంతర నిఘాలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్టాన్ని గౌరవించే వారికి అండగా ఉంటాం, ప్రజల ప్రశాంతతను పాడుచేస్తే ఉపేక్షించం.”
