మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. అందుకే విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్‌ వికాస్‌ కార్యక్రమం కింద ఇందుకూరుపేట మండల యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు ఆమె చెప్పారు. శనివారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసంలో మండల యువతకు 35 క్రికెట్‌, 35 వాలీబాల్‌ కిట్లను యువతకు స్థానిక నాయకుల చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విపిఆర్‌ వికాస్‌ పేరుతో యువతకు కిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. యువత క్రీడల్లో రాణిస్తూ అటు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందాలన్నారు. క్రీడల్లో యువత రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఏకొళ్లు పవన్‌ రెడ్డి, రావిళ్ల వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్‌ బాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *