

మన న్యూస్ ,నెల్లూరు:- సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే సత్ఫలితాలు .- విజన్ యాక్షన్ ప్లాన్ తో సమగ్రాభివృద్ధి.ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్ పి-4 అని, ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్, డిఆర్వో ఉదయభాస్కర్రావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రఘురామయ్య తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేస్తున్న స్వర్ణాంధ్ర`2047 విజన్ యాక్షన్ ప్లాన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సరికొత్త ఆలోచనలతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం ఎమ్మెల్యేతో పాటు 9మంది సభ్యులను నియమిస్తున్నట్లు చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు మనసుపెట్టి పనిచేస్తే మంచి పేరుతో పాటు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలుచేసి పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో యాక్షన్ ప్లాన్ను రూపొందించినట్లు చెప్పారు. మన జిల్లాలో ఆక్వారంగం బాగుందని, ఈ రంగం అభివృద్ధికి పి-4 విధానాన్ని జోడించి అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలన్నదే స్వర్ణాంధ్ర విజన్ప్లాన్ ప్రధాన ఉద్దేశంగా ఎంపీ చెప్పారు. తద్వారా రాష్ట్ర జిడిపి బాగా పెరిగి అన్నిరకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలోని ఉన్నతవర్గాల వారు పేదలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలిచే గొప్ప కార్యక్రమం పి-4 అని ఎంపీ కొనియాడారు. ప్రతి ఒక్కరు కూడా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎంపీ పిలుపునిచ్చారు.


