

మన న్యూస్ ,కావలి :- నెలలో 15 రోజుల పాటు సరకులు పంపిణీ- చిరుధాన్యాలు సైతం రేషన్ షాపుల ద్వారా లభ్యం- రేషన్ పంపిణీ లో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి నాణ్యమైన నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలనే లక్ష్యంతోనే రేషన్ షాపులను పునఃప్రారంభించినట్టు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక వైకుంఠపురంలోని 29వ రేషన్ షాపు వద్ద లబ్ధిదారులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…… గత ప్రభుత్వ హయాంలో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పక్కదారి పట్టాయని తెలిపారు. లబ్ధిదారుల వద్ద సమయానికి డబ్బులు లేకపోతే సరకులు తీసుకోవడం ఇబ్బందిగా ఉండేదని, పనులు మానుకొని సరకులు తీసుకోవలసిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్లు సరకులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రేషన్ షాపు వద్ద బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఏమి సరుకులు మంజూరు చేసిందో ఆ బోర్డులో పేర్కొనడం జరుగుతుందన్నారు. రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరంగా ఉండాలంటే చిరు ధాన్యాలు అవసరమని తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, పేద బడుగు, బలహీన వర్గాల కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కార్డు ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి రేషన్ షాప్ నుండి సరకులు తీసుకెళ్లాలని కోరారు. ఇది మంచి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వమని, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమని, ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం ఆశీర్వదిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రావణ కుమార్, సిఎస్డిటి విజయమ్మ, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, స్థానిక నాయకులు మంచాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
