

.మన న్యూస్, నెల్లూరు: స్వచ్ఛ నెల్లూరు లక్ష్యంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో త్రీడి మీటర్ స్లీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. కోటి 30 లక్షల రూపాయల విలువైన మిషన్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం వాటి పనితీరును మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించి.. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ కి వాటిని అప్పగించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర కి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. అందుకు అనుగుణంగా ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ దుకాణాలను అయన ప్రారంభించారు. రేషన్ పంపిణీలో మార్పు తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని.. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 42 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి రేషన్ షాపులు అలాగే పనిచేసేవి.. ఈ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం మార్చి గందరగోళానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఇంచార్జి కలెక్టర్ కార్తిక్.. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

