

కడప జిల్లా: జమ్మలమడుగు మన న్యూస్: ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి తెలిపారు. జమ్మలమడుగు ఆర్అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఒక మహిళా నేతను నేరస్తురాలిలా ముట్టడించడం, గృహ నిర్బంధం చేయడం సమాజపరంగా, ప్రజాస్వామ్య పరంగా తీవ్ర అభ్యంతరకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెం గ్రామంలోనే ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ నిర్వహించిన విషయం గుర్తుచేశారు. కానీ 2019–2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “మూడు రాజధానుల నాటకం” ద్వారా ప్రజల్లో అయోమయం రేపిందని, ఇప్పుడు 2025 మే 2న మళ్ళీ అదే ప్రదేశంలో రెండోసారి భూమిపూజ చేస్తున్న ప్రధాని మోడీ, ఆర్థిక, రాజకీయంగా ఆంధ్ర ప్రజలతో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఆటలాడుతోందో స్పష్టం అవుతోందని విమర్శించారు. భాజపా, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు తీసుకుంటున్న ద్వంద్వ ధోరణులను విజయజ్యోతి ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలపై సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తగదని ఆమె వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని దూషించటం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. దూషించాల్సింది కాంగ్రెస్ కాదు, పెహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఇప్పటివరకు పట్టుకోలేని ప్రధాని మోడీని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి అని ఆమె అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన “సూపర్ సిక్స్” పథకాల అమలులో విఫలమైన సంకీర్ణ ప్రభుత్వం, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో శాంతి, అభివృద్ధి, ధర్మనిరపేక్షత ఉండగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక విలువలను అపహాస్యం చేసేలా పనిచేస్తోందని తెలిపారు.
ఈ సమావేశంలో జమ్మలమడుగు అసెంబ్లీ సమన్వయకర్త శివమోహన్ రెడ్డి, వెంకట స్వామి, రషీద్, ఒబయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.