

- వ్యవసాయ పనులకు పిలవరాదు..
- టిఫిన్లు, పాలు ఇవ్వరాదు..
- పెత్తందార్లు నిర్ణయం విచారణ చేపట్టిన ఆర్డీవో, పోలీసులు…
మన న్యూస్ పిఠాపురం (అపురూప్): పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మె ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సి కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య వచ్చి 78 సంవత్సరాలయినా తమపై ఇంకా వివక్షత కొనసాగడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పిఠాపురం మండలంలోని మల్లంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంటికి ఈ నెల 16 న గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ (37) కరెంటు పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై 17న గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులంతా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో దళితులు ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడటం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులను ఇలాగే వదిలేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారని గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెత్తందార్లు సమావేశం పెట్టుకుని పెత్తందారులు తలుచుకుంటే ఏవిధంగా ఉంటుందో దళితులకు తెలియజేయాలని సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.కొందరు పెద్దలు చేసిన నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, అలాగే పాలు పోసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు కూడా పాలు టిఫిన్ ఇచ్చేది లేదని ఈ సందర్భంగా దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాల నివసించే ప్రాంతంలో చేపలు అమ్మకం వగైరా నిలిపివేయాలని హుకుం జారీ చేశారు.