

మనన్యూస్,పిఠాపురం:తమ జీవనోపాధిని దెబ్బతీసే కార్పొరేట్ స్థాయి సెలూన్ షాపులకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ పిఠాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సూర్యరాయా లైబ్రరీ హాలు నందు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్ల కార్డులతో ర్యాలీగా స్థానిక మున్సిపల్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ. జిల్లా అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ మాట్లాడుతూ… నాయిబ్రాహ్మణుల జీవన భృతిని దెబ్బ కొడుతూ… కార్పొరేట్ స్థాయి హంగులు, ఆర్భాటాలతో… సెలూన్ షాపులు వేరే కులాల వారు నిర్వహిస్తూ మా కులానికి అన్యాయం చేస్తున్నారని, కావున వారికి అనుమతులు మంజూరు చేయకుండా ఉండేలా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలనీ కోరుచున్నామన్నారు. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు ప్రతి పనిలో నాయి బ్రాహ్మణులు సమాజానికి ఉపయోగపడుతున్నారని, సమాజంలో వివాహ క్రతువుల్లో గాని శుభ అశుభ దైవ కార్యక్రమాలలో అదే విధంగా దేవాలయాల్లో హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయి బ్రాహ్మణ సమాజం యొక్క ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కడో ఉండి ఫ్రాంచైజీలు అమ్ముకుంటూ ఈరోజు పిఠాపురంలో భారీ ఎత్తున కార్పొరేట్ సెలూన్ షాపు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, మా సోదరులకు తెలిసి ఫ్రాంచైజీ నిర్వహిస్తున్న వారిని మర్యాద పూర్వకంగా అడిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మేము ఆగేది లేదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం శోచనీయమన్నారు. ఎన్నో ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నాయిబ్రాహ్మణ బ్రతుకులు అన్యాయం అవుతున్నాయని, కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి నిర్వహణకు పూనుకునే సెలూన్ షాపులకు అనుమతులు మంజూరు చేయరాదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలకశాఖ పొంగూరు నారాయణ వారిని కోరుచున్నామన్నారు. కులవృత్తి వేరు వ్యాపారం వేరని, మా జీవనోపాధి కోసం మేము మా కులవృత్తిని నమ్ముకుని మేము ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నామని, మా జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యాపారంగా మార్చడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు స్వయంవరపు భద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షులు మెల్లిపాక నాగబాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ నల్లమిల్లి అర్పణ కుమార్, వెన్నేటి సత్యనారాయణమూర్తి, తాతారావు, పిఠాపురం గౌరవ అధ్యక్షులు పసుపులేటి మంగ, ప్రెసిడెంట్ అల్లూరి వెంకటపతి మరియు కార్యవర్గ సభ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
