ఉరవకొండ, మన ధ్యాస:రాజకీయ పార్టీల్లో కార్యకర్తల అసంతృప్తికి కొత్త కారణాలు చేరుతున్నాయి. ముఖ్యంగా “60-40” శాతం లాభాల పంచకం జరుగుతోందన్న ఆరోపణలు కిందిస్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పైస్థాయి నాయకులు కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారనే భావన కార్యకర్తలలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.గ్రామ స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, తాము చేసిన శ్రమకు తగిన గుర్తింపు లేదా ప్రయోజనం దక్కడం లేదని వాపోతున్నారు. ఒకవైపు నాయకులు నగరాల్లో సౌకర్యవంతమైన జీవనం గడుపుతూ పరస్పరం సఖ్యతగా ఉండటం, మరోవైపు గ్రామాల్లో కార్యకర్తలు చిన్న చిన్న విషయాలకే విభేదాలు పెట్టుకుని తగువులాడటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది.“పార్టీ కోసం మేము కొట్లాడుకుంటుంటే, పైస్థాయిలో మాత్రం 60-40 పంచుకుంటూ కలిసి ఉంటారా?” అనే ప్రశ్న కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఈ భావజాలం పెరుగుతుండటం పార్టీ అంతర్గత ఐక్యతకు ముప్పుగా మారుతోంది.రాజకీయంగా చూస్తే, కార్యకర్తల ఉత్సాహం తగ్గడం పార్టీకి నేరుగా నష్టాన్ని కలిగిస్తుంది. వారు కేవలం ఓటు వేయడం వరకు మాత్రమే పరిమితమై, ప్రచారంలో చురుకుగా పాల్గొనకపోతే ఎన్నికల ఫలితాలపై ప్రభావం తప్పదు.ఈ నేపథ్యంలో, నాయకత్వం స్పష్టత ఇవ్వడం, ఆరోపణలపై వివరణ ఇవ్వడం, కార్యకర్తల నమ్మకాన్ని పునరుద్ధరించడం అత్యవసరం. లేకపోతే, “60-40” వంటి చర్చలు పార్టీకి దీర్ఘకాలిక నష్టాన్ని మిగల్చే అవకాశం ఉంది.