
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:
కాకినాడ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి,బెండపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాల కంటే ముందుగా స్వయంభూగా 143 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతుంది.సరైన దారి మార్గం,కనీస వసతులు లేక మరుగునపడ్డ ఈ పురాతన దేవాలయానికి శివయ్య ఆజ్ఞ ఏమో తెలియదు కానీ బిజెపి నాయకులు రాజా వత్సవాయి కింగ్ బాబు రాజు,సింగిలిదేవి సత్తిరాజు,కార్మిక నాయకులు పత్రి రమణ,కాంగ్రెస్ నాయకులు ధరణాలకోట శ్రీను,రిటైర్డ్ ఎంఈవో ముక్కు సుబ్రహ్మణ్యం,డాక్టర్ బేతా ఈశ్వరరావులు కలిసి వారి సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణకు నడుం బిగించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం ఏర్పాటు చేసి అభిషేకాలు,రాత్రికి జాగారం,విశేష పూజలకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అధిక సంఖ్యలో ఈ పురాతన దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని,తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి పరచడడానికి అభివృద్ధి కమిటీ సభ్యులు కలవడం జరిగిందని,నిధుల మంజూరుకు తప్పక కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు.అలాగే తమ సొంత నిధులతో కూడా త్వరలోనే ఈ పురాతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి గతంలో మాదిరిగా పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.ఈ 143 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి పూర్వవైభవం తీసుకురావాలని వారు కోరారు.