మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 23:నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్లతో చెక్ పడుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి ఆదేశాలతో రూ.1.39 కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హరనాధపురం, రామలింగాపురం, వీఆర్సీ, కనకమహల్ సెంటర్ లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎస్పీ అజితా వేజెండ్ల లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ…… కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో ఏడు చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసారని తెలిపారు. ఈ క్రమంలో నాలుగు చోట్ల లాంఛనంగా ప్రారంభించినట్లు తెలియజేశారు. నెల్లూరులో వరద ముంపునకు కాలువలపై అక్రమణలే కారణమని, అందువల్లే 2019 లో సగం నగరం నీట మునిగిందని గుర్తు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు ఇక్కడే బస చేసి సహాయచర్యలు చేయించారన్నారు. పూడికతీత పనుల వల్ల గత నెలలో తుఫాన్ ముప్పును తప్పించగలిగామని చెప్పారు. కాలువలు వెడల్పు చేస్తే తప్ప పూర్తి స్థాయిలో ముంపును నివారించలేమన్నారు. అక్రమ కట్టడాల తొలగింపునకు ఆక్రమణ దారులు సహకరించాలని తెలియజేశారు. ఆక్రమణల్లో పేదలు ఉంటే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…… ట్రాఫిక్ సిగ్నల్స్ ని ప్రజలు కచ్చితంగా ఫాలో కావాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ప్రమాదాలు తగ్గి ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో ఫలితం లభిస్తుందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని సీఎం తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలేస్తోందన్నారు. మంత్రి నారాయణ నెల్లూరువాసి కావటం మన అదృష్టం అన్నారు. నిధుల కొరత ఉన్నా తనదైన శైలిలో నెల్లూరు సిటీ , రూరల్ అభివృద్ధికి కృషిచేస్తున్నారని కొనియాడారు. తదనంతరం నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…… మంత్రి నారాయణ చొరవతో నెల్లూరులో అభివృద్ధి పరుగులు పెడుతోందని..ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసారని..కార్పొరేషన్ పరిధిలో అవసరమైన అన్ని చోట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కాబోతున్నాయన్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, టిడిపి ముఖ్య నేతలు డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.


