

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరులో మెగా పేరెంట్స్ డే
గూడూరు, మన న్యూస్ :- “పిల్లలలే తల్లిదండ్రులకు విలువైన ఆస్తి” అని అధికార పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మట్టం శ్రావణీరెడ్డి పేర్కొన్నారు. నేడు చెన్నూరు బాలుర పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే 2.0 లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని తయారు చేయించిన నూతన ఐడి కార్డులను ఆమె పిల్లలకు అందజేశారు. తదుపరి జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో తమ బిడ్డలను ఆశీర్వదిస్తూ తల్లులు భావోద్వేగానికి లోనైనారు. పిల్లల సమగ్ర వికాసాభివృద్ధికి తీసుకొంటున్న చర్యలను వారికి వివరించారు. ‘తల్లి పేరుతో ఒక మొక్క’ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా తల్లులకు ముగ్గులు, తండ్రులకు తాడు లాగే పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఫోటోబూత్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తల్లిదండ్రులందరూ మధ్యాహ్న భోజనం స్వీకరించి, తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. బాలనాగమ్మ, ఛైర్పర్సన్ దారా వసంత, ఉప చైర్మన్ ఇమ్మిడిశెట్టి ప్రసాద్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
