

కడప: మన న్యూస్: జూన్ 15: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని , ఆ నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుళ్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక సీపీఐ ఆఫీస్ హోచ్మిన్ భవన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు. నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలము గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం , ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగుల ఊసే ప్రభుత్వం ఎత్తని పరిస్థితి ఉందని, రాష్ట్రంలో 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏ ఉపాధి లేనివారు ఒక కోటి 56 లక్షల మంది ఉన్నట్లు అందులో కడప జిల్లాలో 6 లక్షల పైచిలుకు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఇంతమంది నిరుద్యోగులు కడప జిల్లాలో మరియు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి ఉద్యోగాలు కల్పించవలసిన పద్ధతి ప్రభుత్వానికి లేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఈ నెల 15 నుండి జూలై 15 వరకు నిర్వహించబోయే సంతకాల సేకరణలో జిల్లాలోని నిరుద్యోగులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్, అరుణ్ జిల్లా సమితి సభ్యులు మధు తదితరులు పాల్గొన్నారు.