మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 7:అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ.50 వేలు చెక్కు ఇచ్చానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పై చేసిన అనవసర ఆరోపణలకు ఎంపీ వేమిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారని, తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో తెలియదా అని ప్రశ్నించారు. శ్రీ కాకుళంకు చెందిన అప్పన్న అనే వ్యక్తి పేదవాడు, జరుగుబాటు లేదు అని నాడు వైవీ సుబ్బారెడ్డి దగ్గర చేరితే, సుబ్బారెడ్డి తాను సహాయం చేయలేను అని నన్ను అడిగితే… ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశానో.. ఆ రోజు కూడా అలాగే చేశానని కుండబద్దలు కొట్టారు. తాను మాట్లాడే విషయాలు సత్యమా, కాదా అనేది దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి జరుగుబాటు లేదని అంటే.. ఇప్పటికీ కూడా చాలామందికి సహాయం చేస్తున్నానని, తాను నెలలో సహాయం చేసేవాళ్ల లిస్ట్ తీస్తే చాలామంది ఉంటారన్నారు. ఈ విషయాలు వారికి కూడా తెలుసని, ఎవరు చెబితే ఇచ్చానో వారి దృష్టిలో ఉందన్నారు. అసలు తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఖండించారు. సేవాభావంతోనే తాను సహాయం చేస్తుంటానని, సేవ చేయడం కూడా తప్పవుతోందని అన్నారు. బండలు మోయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత చేశామో, ఎవరికి చేశామో, మనం చేసే మంచేంటో దేవుడికే తెలుసని, జగన్ మోహన్రెడ్డి మాటలు బాధేశాయి కాబట్టే ఇప్పుడు చెబుతున్నానన్నారు.







