
మన న్యూస్, నెల్లూరు, మే 24: కడపలో ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని.. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ నివాసంలో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారిద్దరు చర్చించుకున్నారు. రాష్ట్ర మహానాడుకు జిల్లా నుంచి 50 వేల మంది తరలి వస్తారని అంచనా వేశారు. అందుకు సంబంధించిన రవాణా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను సైతం అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహిస్తున్నారని.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టిడిపి నేత బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
