

- ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు అపురూప్ డిమాండ్..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఆదిమ సమాజంలో ఉన్నామా? ఆధునిక సమాజంలో ఉన్నామా? దళితులను కొట్టి మూత్రం త్రాగిస్తారా? ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోమంటరా? అంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్ ను అపహరించి, తీవ్రంగా గాయపరిచి, నోట్లో మూత్రం పోసి తాగిస్తే, నిందితులు ఏ పార్టీకి చెందిన వారు, ఏ నాయకుడి అనుచరులు అనే విషయంపై చర్చలు చేయటం, ట్వీట్ చేయటం, ఫోటోలు విడుదల చెయ్యకపోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు చర్యగా అభివర్ణించారు. ఒక్కొక్కడిని బహిరంగంగా అరెస్టు చేసి, మీడియా ముందు నిలబెట్టి, జైలుకు పంపాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలోని మూత్ర విసర్జన సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే, అది ప్రభుత్వానికి అగౌరవమని, చాలా ప్రమాదకరం అన్నారు. నిందితులందరినీ అరెస్టు చేయాలని, జేమ్స్ ను హోం మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించాలని కోరారు. ఇలాంటి సంఘటనలను దళిత సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరించారు. బహుజనుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు పరిపాలన కొనసాగుతుందని, అతి త్వరలో బహుజనులు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాజ్యాంగ బుక్కును అమలు చేస్తారని అన్నారు.