

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని ఛైర్మన్, విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ వెల్లడించినట్టు విజయవాడ రైల్వే వినియోగదారుల సలహా మండలి సభ్యులు, మండలంలోని కొంతంగి కొత్తూరు జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను గొర్లి నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఆ విశేషాలను ఓ ప్రకటనలో మీడియాకు నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ నుండి షిరిడి వెళ్లే షిరిడి సాయి నగర్ రైలులో ఏసి బోగీలు ఎక్కువగా ఉండటం వలన పేద, మధ్యతరగతి ప్రయాణికులకు భారం కనుక, జనరల్ బోగీలు ఎక్కువగా పెంచాలని, ఎల్.టి టి, న్యూఢిల్లీ, గరీబ్ రథ్ రైళ్ళతో పాటు మిగతా రైళ్ళను కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని,అన్నవరం రైల్వే స్టేషన్లలో నిలుపుదల చేయాలని, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సమావేశంలో నాగేశ్వరరావు కోరారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అన్నవరం దేవస్థానం పెద్దది కావడంతో రోజుకు 50,000 వేల మంది భక్తులు వరకూ సత్యదేవుడిని దర్శించు కోవడానికి వస్తారని అదేవిధంగా తమలపాకుల రైతులకు తుని నుంచి నేరుగా బొంబాయికి రైలు లేక తమలపాకుల రైతులు తొలుత సికింద్రాబాదుకు అక్కడ నుంచి తిరిగి బొంబాయికి ఎగుమతి చేయడం వల్ల తమలపాకులు పాడవుతున్నాయనే వాటిని ప్రధాన సమస్యలుగా సభ దృష్టికి గొర్లి నాగేశ్వరరావు తెచ్చారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో తాగునీటి సదుపాయం, మెరుగు దొడ్లు, పారిశుధ్యం గురించి, స్టేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో నాగేశ్వరరావు చర్చించారు. ఈ సమస్యల దశలవారీగా పరిష్కారానికి విజయవాడ రైల్వే డి.ఆర్.ఎం. నరేంద్ర ఆనంద్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో 19 మంది డి.ఆర్.యు.సి.సి. సభ్యులు పాల్గొన్నారు.