

మనన్యూస్,తిరుపతి:దేవుడితో రాజకీయాలు చేస్తున్న టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం అలిపిరి పాదాల మండపం వద్దనున్న గోకులంలోని గోవులకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గోపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరుణాకర రెడ్డికి పేరులో మాత్రమే కరుణ ఉందని, ఆ మనిషిలో కరుణ ఏ మాత్రం లేదని చెప్పారు. టీటీడీ మరియు హిందుత్వం పై ప్రణాళిక బద్ధంగా దాడి చేసేందుకు అపద్ధపు ప్రచారాలతో గోశాల పరిరక్షణను తెరమీదకు తెచ్చిన మతోన్మాదులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయనే అసత్యపు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ది ప్రసాదించాలని దేవుని ప్రార్థించినట్లు బాలసుబ్రమణ్యం చెప్పారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడవద్దని హితువు పలికారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కరుణాకర్ రెడ్డికి కోడూరు బాలసుబ్రమణ్యం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, ఎం ఆర్ పల్లి రామచంద్రారెడ్డి, మధుబాబు రఫీ, ఖాజా లక్ష్మి ప్రమోద్ పాల్గొన్నారు.
