
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం; కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు గణనీయంగా మందు రేట్లు తగ్గిస్తామని అనేక సభల్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్,మరియు పవన్ కళ్యాణ్ అప్పటి జగన్ సర్కార్ లిక్కర్ రేట్లను గణనీయంగా పెంచడాన్నీ దుమ్మెత్తి పోస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత,పాత ధరలకే మద్యం విక్రయాలు జరిపిస్తామని ఆర్భాటంగా హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్, మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసి, వైసిపి ప్రభుత్వంలో పెంచిన మద్యం రేట్లను బాటిల్ కు 20 నుంచి 30 రూపాయలు వరకు తగ్గించింది. ఆరు నెలలు గడవనిచ్చి మళ్ళీ బాటిల్ కి పది రూపాయలు పెంచుతూ జీవో జారీ చేసింది. తర్వాత రాష్ట్రంలోని మద్యం వ్యాపారులందరూ సిండికేట్ అయి క్వార్టర్కు ఎమ్మార్పీ రేటు పై పది రూపాయలు అదనంగా వసూలు చేసి మద్యపాన ప్రియులను దోచుకోవటం మొదలెట్టారు. దీనిపై ఎందరు ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. అధికారులు ముడుపులు తీసుకుని మద్యం సిండికేట్ జోలికి వెళ్లడం లేదని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ మద్యం రేట్లను బాటిల్ పై మరో 10 రూపాయలను పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో మద్యపాన ప్రియులు మరింత షాక్ కు గురయ్యారు. తమ ఆదాయం పెంచుకోవడం కోసం మద్యపానం అలవాటు ఉన్న పేదవారిని, దోచుకోవటం ఎంతవరకు సబవు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లోగడ వైసిపి ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాల్లో మద్యం రేట్లు విపరీతంగా పెంచడం కూడా ఒక కారణమే. ఆ విషయం కూటమి సర్కార్ విస్మరిస్తోందా? అని కూటమి పార్టీల అభిమానులు అనుకుంటున్నారు. సర్కారు ఈ విధమైన నిర్ణయాలు తీసు కుంటుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.