

మన న్యూస్, కోవూరు ,ఆగస్టు 7:- చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో ఒక భాగం. – వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలి. – జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు. – చేనేత కుటుంబాలకు ఉచిత విద్యత్తు నేటి నుంచే అమలు. – హ్యాండ్ లూమ్ ఉత్పత్తులపై వున్న 5 శాతం జీఎస్టీ రాష్ట ప్రభుత్వమే భరిస్తుంది. – మంగళగిరి తరహా వీవర్స్ శాలను రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తాం. – సంపన్నులు పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి. – పి 4 కార్యక్రమంలో భాగంగా బుచ్చి మండలంలోని రామచంద్రాపురం ఎస్టీ కాలనీని దత్తత తీసుకొని విపిఆర్ ఫౌండేషన్ తరుపున అభివృద్ధి చేస్తున్నాం.- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రతి ఒక్కరు వారంలో ఒకరోజైన చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి చేయూత ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు మండలం పాటూరులో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి చేనేత కార్మికులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా తయారు చేసిన నూలు పోగులతో చేసిన మాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. మురళి అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ …….సమాజంలో వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి హామీ అమలు చేస్తున్నారన్నారు. మ్యాన్యువల్ మగ్గాలున్న కుటుంబాలకు 200 యూనిట్లు, మరగ్గాలున్న చేనేత కుటుంబాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ నేటి నుంచే అమలులోకి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక మాస్టర్ వీవర్స్ కు ఆర్ధిక సహాయం అందించేందుకై కొత్తగా 45 చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేస్తే ఒక్క కోవూరు పరిధిలోనే 3 సొసైటీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 76 లక్షలతో మంజూరైన “పాటూరు-గుమ్మలదిబ్బ ” మిని క్లస్టర్ ద్వారా పాటూరు, గుమ్మలదిబ్బ గ్రామములలో దాదాపు 200 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు. తొలి విడతగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 20 లక్షల నిధులు విడుదల అయ్యాయన్నారు. 2015 చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనన్నారు. గతంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసేలా చారితాత్మక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నేడు చేనేత వస్త్రాల పై వున్న 5 శాతం జీఎస్టిని రాష్ట ప్రభుత్వమే భరించేలా అంగీకారం తెలపడం పట్ల ఆమె చేనేత కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియచేసారు. నూలు పోగులతో అద్భుతాలు ఆవిష్కరించే మన నేతన్నల విభిన్నమైన చేనేత డిజైన్లకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చే దిశగా ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, వీవర్స్ శాల పేరిట మార్కెటింగ్, డిజైన్ ఇన్నోవేషన్, ఈ-కామర్స్ ద్వారా చేనేత రంగానికి తోడ్పాటు అందించేందుకు మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందచేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా చేనేత ఉత్పత్తులలో కొత్తదనం తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నేత కార్మికులకు సూచించారు. చేనేత రంగానికి బాసటగా నిలుస్తూ నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేదుకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. సంపన్నులు చేనేత పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేసారు. పి 4 కార్యక్రమంలో భాగంగా బుచ్చి మండలంలోని రామచంద్రాపురం ఎస్టీ కాలనీని దత్తతతీసుకొని విపిఆర్ ఫౌండేషన్ తరుపున అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, స్థానిక టిడిపి నాయకులు ఆదాల శివారెడ్డి, గునపాటి రవీంద్ర రెడ్డి, చేనేత సంఘ నాయకులు వంశీకృష్ణ, పులి సురేష్, పెండెం వెంకట శేషయ్య, బాలకృష్ణ, సంధ్య, జగదీశ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


