

మన న్యూస్ ,నెల్లూరు :- జులై 6 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు .ప్రసిద్ద బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో మంత్రి నారాయణ జులై 6 నుండి ప్రారంభమయ్యే రొట్టెల పండుగ ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణ కాంత్, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. ఘన చరిత్ర గల బారాషాహీద్ దర్గా పరిసర ప్రాంతాలను గతంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దర్గా అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేశారన్నారు. 20 వేల మంది భక్తులు ఒకేసారి ప్రార్థనలు చేసేందుకు అనుకూలంగా ప్రార్థన మందిరాన్ని ఆయా నిధులతో నిర్మిస్తామన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నుడా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. రొట్టెల పండుగలో భక్తులకు అవసరమైన ఇతర ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు జాయింట్ కలెక్టర్ తో సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలో పెయింటింగ్ పనుల సాగతీతపై మంత్రి పొంగూరు నారాయణ మండిపాటు. నెల్లూరు నగరంలోని అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జిల వద్ద, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద అందమైన పెయింటింగ్ పనులు సంవత్సర కాలంగా కొనసాగుతుండడం పై సంబంధిత అధికారులు, పెయింటింగ్ కాంట్రాక్టు వారిపై మంత్రి నారాయణ మండిపడ్డారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అండర్ పాస్ గోడలు, ఓవర్ బ్రిడ్జి స్తంభాలపై అందమైన పెయింటింగ్ లు వేయమని సూచించామన్నారు. రాబోయే 45 రోజుల్లో నగరంలోని అన్ని ప్రదేశాల్లో పెయింటింగ్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.బారాషాహిద్ దర్గా అభివృద్ధికి మంత్రి నారాయణ సహకారం అపూర్వం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత నెల్లూరు బారాషాహీద్ దర్గా అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో ముఖ్యమంత్రి ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో విశాల ప్రార్ధనా మందిరాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో ప్రార్ధనా మందిర డ్రాయింగ్ పూర్తి చేయడం జరిగిందని, నుడా ఆధ్వర్యంలో నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ…… మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా నుడా ఆధ్వర్యంలో ప్రార్థన మందిరాన్ని నిర్మిస్తామన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పనులు వేగవంతంగా చేయటానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్, నుడా అధికారులు పాల్గొన్నారు.
