మనన్యూస్:ఏలేశ్వరం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఐదేళ్ల కాలంలో పది సార్లు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించమని వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్య ప్రభ ఎద్దేవా చేశారు.శనివారం ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట,జే.అన్నవరం రహదారిని ఆర్.అండ్.బి చీఫ్ ఇంజనీర్ నయీముల్లాతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2021 నుండి 2024 మధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను10 సార్లు పెంచడం జరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు విద్యుత్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని, చూస్తున్నారని వారి ఆటలు ఏమి సాగవని,ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని ఆమె అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం,అనుబంధ రంగాలు,విద్యారంగం,వైద్యరంగం విద్యుత్ రంగం ఇలా అన్ని వ్యవస్థలను తన అనాలోచిత నిర్ణయాలతో బ్రష్టు పట్టించారని ఆమె దుయ్యబట్టారు.ఇప్పుడు ధర్నాల పేరిట కొత్త నాటకానికి తెర తీశారని ఆమె అన్నారు.సోలార్ విద్యుత్తు, విండ్ విద్యుత్తు రంగాల కంపెనీల పెట్టుబడిదారులను భయపెట్టిరాష్ట్రం నుండి వెళ్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారన్నారు.53 ఏజెన్సీ గ్రామాలకు ప్రధాన రహదారైనా ఏలేశ్వరం, జె.అన్నవరం రోడ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సర్వనాశనం అయిందని, ఈరోజు ఆ రోడ్డును ఆర్.అండ్.బి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని,రాబోయే నూతన సంవత్సరంలో పలు రహదారుల పనులు ప్రారంభించడం జరుగుతుందని,సాధ్యమైనంత తొందరగా ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగిందని ఆమె తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, తెదేపా నాయకులు అలమండ చలమయ్య బొద్దిరెడ్డి గోపి,ముది నారాయణస్వామి,చిక్కాల లక్ష్మణరావు,సుబ్బరాజు మరియు కార్యకర్తలు,అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *