మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన మొక్కలు ద్విచక్ర వాహనదారులకు తగులుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్గంలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రానికి అధికారులు,సిబ్బంది తరచూ రాకపోకలు సాగిస్తున్నప్పటికీ,రహదారి పక్కన పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపుపై నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.నీటి విడుదల సమయంలో ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు కూడా ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నప్పటికీ సమస్యను పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని హసన్పల్లి గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.