మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) జూన్ 6: గున్కుల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ గంగి రమేష్ యాదవ్ అన్నారు.శనివారం మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం,మౌలిక సదుపాయాలు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు,అనంతరం
సర్పంచ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ ..గ్రామాన్ని పరిశుభ్రంగా,పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.తడి,పొడి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి కంపోస్ట్ ఎరువు తయారు చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పరిశుభ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లత,ఉప సర్పంచ్ సాయగౌడ్, పంచాయతీ కార్యదర్శి చాకలి అంజయ్య, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు ఉన్నారు.