వాహనదారుల కష్టాలకు లభించిన విముక్తి!…
రేణిగుంట మే 13.
తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో గత నెల రోజులుగా సాగుతున్న వాహనదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, రేణిగుంట పట్టణంలోకి రావాలంటే వాహనదారులు పాత రోడ్డు లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆ మార్గాల్లో రోడ్లన్నీ గుంతలమయమై, ప్రయాణం నరకప్రాయంగా మారిందని అటు స్థానికులు, ఇటు తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ట్రాఫిక్ కష్టాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు పూర్తయి, తాజాగా అండర్ బ్రిడ్జ్ పునఃప్రారంభమైంది.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కృషితోనే ఈ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయని టీడీపీ నాయకులు కొనియాడారు. ప్రజలు, భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. సుధీర్ రెడ్డి చొరవ వల్లే నెల రోజులుగా పడుతున్న కష్టాల నుండి వాహనదారులకు విముక్తి లభించిందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా రేణిగుంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజా సౌకర్యాలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాము అధికారులతో, కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూశామన్నారు. అనంతరం, ప్రజా సమస్యను గుర్తించి సానుకూలంగా స్పందించి పనులు పూర్తి చేసిన అధికారులను మహబూబ్ బాషా మరియు ఇతర నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీవో రవిచంద్ర, సిఐ జయచంద్ర, రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, టీడీపీ నాయకులు డి.పి. పుష్పనాథం, ముస్లిం మైనార్టీ నాయకులు నవాబు, యువ నాయకుడు విద్యాసాగర్, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అండర్ బ్రిడ్జ్ తెరుచుకోవడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు




