వింజమూరు మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె.)

వింజమూరు మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వయంగా దగ్గరుండి సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా, ప్రజలకు ఉపయోగకరంగా, పరిపాలనా పరంగా ఆదర్శప్రాయంగా జరిగేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సమీక్షించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ , ఆత్మకూరు మరియు కావలి ఆర్డీవోలు, వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.ముఖ్యమంత్రి పాల్గొననున్న సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకల సౌకర్యం, పార్కింగ్, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా సవివరంగా సమీక్షిస్తూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.అనంతరం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్ల పురోగతిని తెలుసుకుని, ఇంకా చేపట్టవలసిన పనులపై తగిన మార్గదర్శకాలు అందించారు. నిర్ణయించిన గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఎంతో ప్రాధాన్యత కలిగినదని పేర్కొంటూ, ఈ పర్యటన వింజమూరు మండలానికి మరింత అభివృద్ధి దిశగా కొత్త ఊపునిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పర్యటన విజయవంతం కావడానికి అధికారులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
