మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 8 :* జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో దేశాభివృద్ధికి బాటలు- కేంద్రం మన కోసం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు జీఎస్‌టీ 2.0-* ప్రజలు నిత్యం ఉపయోగించే అన్నివస్తువులపై తగ్గిన రేట్లు- *ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో నెలరోజులు అవగాహన కార్యక్రమాలు- *సామాన్యులకు జీఎస్‌టీ 2.0తో ఎంతో ప్రయోజనం- *మీ పరిధిలో ప్రతి ఒక్కరికీ జీఎస్‌టీపై అవగాహన కల్పించండి*- 16న కర్నూలులో జీఎస్‌టీపై ప్రధాని మోడీ సభ .కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్‌టీ 2.0 సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేస్తాయని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జీఎస్‌టీ సంస్కరణలతో ప్రతి ఇంట్లో దీపావలి కాంతులు వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా సేల్స్‌ ట్యాక్స్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన జీఎస్‌టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్‌టీ తగ్గింపుతో ప్రజలకు, వ్యాపారులకు కలిగే మేలును ఆయన వివరించారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి.. జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ‘వుయ్‌ సపోర్ట్‌ జీఎస్‌టీ’ అనే బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు ఆదేశాలతో జీఎస్టీ పై ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా జీఎస్‌టీ సంస్కరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం జీఎస్‌టీపై దాదాపు 500 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. 2017లో నాలుగు స్లాబులతో జీఎస్‌టీని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని మరింత సులభతరం చేస్తూ రెండు స్లాబులతో జీఎస్టీ 2.0 ను ప్రవేశపెట్టిందన్నారు. పేదలకు మరింత లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయంతో దేశప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల మేర లబ్ధి కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల మేర నష్టం కలుగుతున్నా.. ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు జీఎస్‌టీని ప్రోత్సహిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం, చేతివృత్తులు, పర్యాటకం, ఆరోగ్యరంగం వంటి అన్ని కీలక రంగాలు దీనితో లాభపడుతున్నాయని వివరించారు.జీఎస్‌టీ 2.0పై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని ఎంపీ వేమిరెడ్డి సూచించారు. ఇది ప్రతి ఒక్కరితో ముడిపడిన కార్యక్రమమని, ఇందులో ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలన్నారు. ఎవరి పరిధిలో వారు.. వీలైనంత మందికి జీఎస్‌టీ 2.0పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరు మరో 10 మందికి అవగాహన కల్పిస్తే.. వారు మరికొందరికి అవగాహన కల్పించేలా చూడాలన్నారు. తమకు అందుతున్న మేలును వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. గతంలో ఆరోగ్య, జీవిత బీమా మీద 18% GST ఉంటే ఇప్పుడు నుంచి పూర్తిగా తొలగించారని, ప్రతి ఒక్కరూ హెల్త్‌ ఇన్‌ష్యూరెన్స్‌ తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ మందులు, ఇతర అత్యవసర మందులపై జీఎస్‌టీ ఇప్పుడు పూర్తిగా తొలగించడంతో ప్రజలకు మరింత అందుబాటులో ఉంటున్నాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ సంస్కరణలను స్వాగతిస్తూ, రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్‌టీ అంశంపై ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలులో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమ ఆహ్వానం మేరకు అడిగిన వెంటనే జీఎస్‌టీ 2.0 అవగాహన కార్యక్రమానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి ఎంపీ అందించిన సహాయ సహకారాలను కొడియాడారు. జీఎస్‌టీ 2.0పై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు దశల వారీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జీఎస్‌టీ వల్ల ప్రజలకు ఎంతో లబ్ధి కలుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే తమ శాఖ తరఫున రేట్ల బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రంగాలవారీగా జీఎస్‌టీ లబ్ధిని ఆయన సభ ముందుంచారు. కార్యక్రమంలో జిల్లా సేల్స్‌ ట్యాక్స్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటేశ్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ కృష్ణమోహన్‌, మదీన వాచ్‌ అధినేత ఇంతియాజ్‌, ఏసీసీ రాష్ట్ర అధ్యక్షులు రంగయ్యనాయుడు, నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, గుడి హరిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *