
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 30 ,కామారెడ్డి జిల్లా గర్వకారణమైన నిజాంసాగర్ జలాశయం నిర్మాణం ఎంతో బలమైనదని,రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చెక్కుచెదరని దృఢత్వం కలిగిన ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి,వరద నీటి ప్రవాహం,నీటి నిల్వల పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు ఈఈ సాలోమాన్ షబ్బీర్ అలీకి వివరాలు అందిస్తూ – ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 1,00,963 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా,15 ప్రధాన గేట్లను ఎత్తి 69,748 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నామని చెప్పారు.పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1400 అడుగులు 11.891 టీఎంసీలు నీరు ఉందని వివరించారు.ప్రాజెక్టు అందాలను ఆస్వాదన
ప్రాజెక్టుపై గల గోల్ బంగ్లాను సందర్శించిన షబ్బీర్ అలీ, అక్కడి నుండి జలాశయం విస్తీర్ణం,నీటి అందాలను తిలకించారు.ఈ దృశ్యాలను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ- నిజాంసాగర్ జలాశయం కేవలం సాగునీటికి కాకుండా, పర్యాటకానికి కూడా అపారమైన అవకాశాలు కలిగి ఉందని చెప్పారు.చారిత్రక ప్రాధాన్యం,నిజాంసాగర్ జలాశయం నిర్మాణం చాలా పురాతన కాలం నాటిదని,దాదాపు శతాబ్ద కాలాన్ని దాటినా ఇప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.ప్రజల స్పందన
షబ్బీర్ అలీ పర్యటనతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.వరద ప్రవాహం పెరిగినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ప్రాజెక్టు వల్ల మా ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. రైతులకు సాగునీరు లభిస్తోంది. రైతులకు రెండు పంటలకు నీరు డోకా లేదన్నారు ఇదే మా ప్రాణాధారం అని రైతులు తెలిపారు.అంతకంటే ముందు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఈఈ సోలేమన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.ఈ సందర్శనలో రాష్ట్ర యువ నాయకులు మహమ్మద్ ఇలియాస్, జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రోస్, నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్,తదితరులు ఉన్నారు.

