

హైస్కూలు, మోడల్ స్కూలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఆహార పదార్ధాల తనికీలు, అంగన్వాడి సెంటర్లలో రిజిస్టర్లు సరిగా లేవని సెక్టర్ సూపర్వైజర్లపై ఆగ్రహం వ్యక్తం…
శంఖవరం మనన్యూస్ ప్రతినిధి :- శంఖవరం మండలంలోని నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు ఇ లక్ష్మీరెడ్డి, జె కృష్ణ కిరణ్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నెల్లిపూడిలోని 2వ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో తనికీలు చేసి, రికార్డులను పరిశీలించారు. శంఖవరంలోని 4వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో ఆహార పదార్ధాలను తనికీ చేసి, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ లోపించినట్లు కనబడుతుందని, వీటిపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, సూపర్వైజర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్
నోటీసు ఇవ్వమని ఐసిడిఎస్ సిడిపిఓ పర్వత వెంకటలక్ష్మిని ఫుడ్ కమీషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆదేశించారు. అనంతరం శంఖవరంలోని జెడ్పీ హైస్కూలుకు చేరుకున్న కమీషన్ సభ్యులు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాలను విస్తృతంగా పరిశీలించారు. ఈ భోజనాలలో రైస్ పెద్ద సైజ్ లో ఉండడం, చెట్నీలో పోపులు లేకపోవడంతో పుల్లగా ఉండడాన్ని, కోడి గుడ్లు నాసిరకంగానూ, చిట్లిపోయి ఉండడాన్ని గుర్తించారు. దీనిని ఎవ్వరు తయారు చేస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు కామేశ్వరమ్మను వివరాలు అడుగగా, బెండపూడికి చెందిన అల్లూరి
సీతారామరాజు ట్రస్ట్ నుండి సరఫరా అవుచున్నాయని వెల్లడించారు. గుడ్లను పాఠశాల ఆవరణలోనే ఉడికించే ఏర్పాట్లు చేయాలని, సన్నబియ్యం వాడే విధంగా చర్యలు చేపట్టాలని ఎఎస్ఓ ప్రసన్నలక్ష్మి, పెద్దాపురం డివైఇఓ ప్రభాకర శర్మలను ఆదేశించారు. అనంతరం
సమీపంలోని ఎపి మోడల్ స్కూలులో గల హాస్టలులోని వంటగదిని, ఆహార పదార్ధాలను తనికీ చేసారు. సన్నబియ్యం ఆహారంగా అందించడం, కూర నాణ్యతతో ఉండడాన్ని గుర్తించి అభినందించారు. స్టోర్ లోని పాల ప్యాకెట్లను గడువు లోపునే వినియోగించాలని, కంది
పప్పు, శనగలు, చక్కీలను పరిశీలించారు. చక్కీ ప్యాకెట్లపై ముగింపు తేది లేకపోవడాన్ని గుర్తించి, సంబంధిత సరఫరాదారుకు విషయం తెలిపి, తక్షణమే తయారు తేది, ముగింపు తేది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ వీర్రాజు, వార్డెన్ లకు
సూచించారు. ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి, కృష్ణ కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో మూడు రోజుల పాటు తమ పర్యటన కొనసాగుతుందని, ప్రభుత్వం ఎంతో మంచి లక్ష్యంతో అందిస్తున్న మధ్యాహ్న భోజన పధకం, అంగన్వాడి కేంద్రాల్లో అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. ఆయా పాఠశాలల్లో గుర్తించిన లోపాలను, వాటిని సరిదిద్దుకునేలా చర్యలు
తీసుకోవడమే తమ పర్యటన ముఖ్యోద్దేశమన్నారు. మలి విడతలో ఏజన్సీ గ్రామాల్లో గల హాస్టళ్ళను తనిఖీ చేయన్నున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో కాకినాడ డివైఇఓ ఎన్ వెంకటేశ్వరరావు, ఏఎన్టీ భానుప్రియ, ఎంఇఓ ఎస్వీ రమణ, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.