

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. పట్టణంలో చినుకుపడితే చాలు రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి.ముఖ్యంగా ఏలేశ్వరం నుండి ఎర్రవరం హైవే కి వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి నీ నగర పంచాయతీ అధికారులు అభివృద్ధి చేసిన తర్వాత కలలో కూడా ఊహించని సంఘటన ప్రజలు చవిచూస్తున్నారు. చిన్నపాటి చినుకు పడితే చాలు ప్రధాన రహదారి చెరువు అయిపోతుంది. వర్షం నీరు రహదారిపై వచ్చి ప్రవహిస్తుంది. ఎవరైనా సరే మోకాళ్ళ లోతు నీటిలో తడిసి నడవాల్సిందే. లేనిపక్షంలో మురికి కాలువల గట్ల పైనుంచి దాటుకొని నడక సాగించాల్సిందే. పట్టణంలో ఆర్ అండ్ బి రహదారి పై వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 2 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.ఈ నిధులను సరిగా వినియోగించక పోగా, వర్షపు నీరు రోడ్లపై నుంచి కాలువలోకి కాకుండా, కాలువలో మురుగు నీరు రోడ్లపైకి వచ్చేటట్లు తిరోగమన అభివృద్ధి సాగింది. పైగా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ తిరోగమన అభివృద్ధి లో కొంతమంది రాజకీయ నాయకుల పెత్తనం అయిపోవడమే కారణం.