


మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి చెందిన పది మంది యువకులు సోమర్ పేట్ సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అలసిపోయిన యువకులు సేదతీరేందుకు మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.అయితే ప్రమాదవశాత్తు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోతు అంచనా వేయలేకపోవడం వల్ల ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ ,పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలించగా మంగళవారం ఉదయం ఒక మృతదేహం మధ్యాహ్నం సమయంలో రెండు మృతదేహాలను వెలికి తీశారు.మొత్తం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్ (18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), సోమర్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్(17)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్ తెలిపారు. సంఘటన స్థలానికి మాజీ జెడ్పిటిసి గయాజుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా, నాయకులు సామెల్, విద్యాసాగర్ తదితరులున్నారు,


