

మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడమే కాక మామూలు స్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మూడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి బుధవారం కోర్టు ప్రాంగణంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తాను బయటకు వస్తుండగా మతిస్థిమితం లేక ఒంటిపై సగం దుస్తులు కప్పుకొని అక్కడక్కడ తిరుగుతున్న యువతిని చూచానని దీంతో ఆమె ఆచూకీ గమనించాలని తమ సిబ్బందితో పాటు పోలీసులకు తెలియజేశానన్నారు. ఆమె సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగర ప్రాంతాల్లో ఈ విధంగా తిరుగుతుందని పోలీసులు బదులివ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఈ విషయంపై ఆమెకు మానసిక వైద్యం అందివ్వాలని వైద్యులు దిశ వన్ స్టాప్ సిబ్బంది తెలియడంతో తాను ప్రత్యేకంగా రిసెప్షన్ అనే ఆర్డర్ నిచ్చానని దీంతో ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆమె వివరాలు కొద్దిగా తెలుసుకున్నామని కమలాదేవి చెప్పారు. ఆ యువతి కాకినాడ నగరానికి చెందినట్లుగాను వైద్య విద్య చదివినట్లుగా విచారణలో తేలిందన్నారు. త్వరలోనే ఆ యువతిని పూర్తి వివరాల సేకరించిన పిమ్మట వారి ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ విధంగా మతిస్థిమితం లేక ఎంతోమంది యువతులు దుస్తులు లేకుండా తిరిగేవారు ఉన్నారని వారి పట్ల ఎంతో దయగా వ్యవహరించాలని వీరి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకుని అండగా నిలవాలని కమలాదేవి హితవు పలికారు.
