మనన్యూస్,గొల్లప్రోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పేదలకు గూడు కల్పిద్దామన్న ప్రభుత్వ ఆశయం అధికారులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.లబ్ధిదారు కొంత సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ లోన్ తో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ ఒక సంస్థ ముందుకు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గొల్లప్రోలులోని పేదల కోసం గత వైసీపీ ప్రభుత్వం పట్టణ శివారులో జగన్ కాలనీ పేరిట సుమారు 2వేల 200 మందికి పైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి హౌసింగ్ లోన్ కూడా మంజూరు చేయడంతో కొంతమంది సొంతంగా ఇళ్ళు నిర్మించుకున్నారు. చాలామంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడంతో స్థలాలు తిరిగి తీసేసుకుంటామని అప్పట్లో అధికారులు హెచ్చరించడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఒక సంస్థ ముందుకు వచ్చి లబ్ధిదారులు 4 విడతలుగా 1లక్షా 80 వేల రూపాయలు చెల్లిస్తే హౌసింగ్ రుణం 1లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తామని ముందుకు వచ్చింది. దీంతో హౌసింగ్ అధికారులకు సుమారు 72 మందిమొదటి విడతగా 35 వేల రూపాయలు చొప్పున చెల్లించారు.సొమ్ము చెల్లించి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇళ్లు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.కొంతమందికి పునాది కోసం ఊచలు వేసారని,మరి కొంతమందికి పునాది దశలోనే పనులు నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు కట్టించుకునే సమయంలో 3 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారని,2సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని వాపోతున్నారు.ఇల్లు నిర్మిస్తారన్న ఆశతో అప్పట్లో అప్పులు చేసి మొదటి విడతగా 35 వేల రూపాయలు చెల్లించామన్నారు. పనులు అర్ధాంతరంగా నిలిపివేసారని కనీసం ఎప్పుడు ప్రారంభిస్తారో హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పడం లేదని, కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు, జిల్లా అధికారులు స్పందించి జగన్ కాలనీలో సొమ్మును చెల్లించిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.హౌసింగ్ ఎ ఇ వివరణ జగన్ కాలనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవడానికి 72 మంది మొదటి విడతగా 35 వేల రూపాయలు చొప్పున చెల్లించారని హౌసింగ్ ఎ ఇ రవీంద్ర తెలిపారు.వీటికీ ప్రభుత్వ రుణం 1 లక్ష 80 వేల రూపాయలతో పాటు లబ్ధిదారులు చెల్లించే 1 లక్షా 80 వేల రూపాయలతో కలిపి కాంట్రాక్టర్ ఇల్లు నిర్మించవలసి ఉందని వివరించారు. ఇప్పటివరకు 13 ఇళ్ల పునాదులకు ఊచలు వేసారని,23 పునాదులు నిర్మించారని,3 గృహాలు గుమ్మాల దశ వరకూ,9 స్లాబ్ దశకు వచ్చాయని,5 గృహాలకు స్లాబులు వేసారని ఎ ఇ వివరించారు.







