మన న్యూస్: తిరుపతి,విజ‌న్-2047 సాకారం దిశ‌గా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు స‌హ‌క‌రించాల‌ని సీడాప్ ఛైర్మ‌న్ జి.దీప‌క్‌రెడ్డి ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు కోరారు.విజ‌య‌వాడ‌లోని సీ.డాప్ కార్యాల‌యంలో శుక్రవారం సీ.డాప్ ఛైర్మ‌న్‌ను శాప్ ఛైర్మ‌న్ శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ, ఉపాధి క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వారిరువురూ చ‌ర్చించారు. తొలుత శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు మాట్లాడుతూ తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో సుమారు 2ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ, పీజీ,ఇంజినీరింగ్‌లు పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్నార‌న్నారు.తిరుప‌తికి మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు,ఇండ‌స్ట్రీల‌ను తీసుకొచ్చి మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాల‌ని, నిరుద్యోగులంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన్న‌వించారు. దీనికార‌ణంగా తిరుప‌తిలో నిరుద్యోగుల సంఖ్య త‌గ్గుతుంద‌ని,యువ‌త‌కు ఉపాధి క‌ల్పించిన‌వార‌మ‌వుతామ‌ని వివ‌రించారు. అలాగే తిరుప‌తి జిల్లాలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేసి యువ‌త‌కు ఉపాధి శిక్ష‌ణ నైపుణ్యాల‌ను పెంచేందుకు కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.దీనికి సంబంధించి ఇప్ప‌టికే శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో 50ఎక‌రాల‌కుపైగా భూమిని గుర్తించామ‌న్నారు.సీడాప్ కూడా దీనిపై దృష్టి సారించి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ప‌నులను త్వ‌రగా ప్రారంభించాల‌ని ఆకాంక్షించారు.దీనిపై సీడాప్ ఛైర్మ‌న్ కూడా సానుకూలంగా స్పందిస్తూ యువ‌త భ‌విత‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని, త‌ప్ప‌నిస‌రిగా తిరుప‌తి పార్ల‌మెంటులో మెగా జాబ్‌మేళా, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బ‌దులిచ్చారు.ఈ కార్య‌క్ర‌మానికి ముందు సీడాప్ ఛైర్మ‌న్ దీప‌క్‌రెడ్డి కి శాప్ ఛైర్మ‌న్ శాలువా క‌ప్పి స‌త్క‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *