రేణిగుంట జూన్ 26.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 25వ తేదీ మధ్యాహ్న సమయంలో ఖాదర్ బాషా సర్కిల్ వద్ద సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో 108 అంబులెన్స్ ద్వారా సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆ వ్యక్తి మృతి చెందాడు.మృతుని ఆనవాళ్లు పరిశీలిస్తే సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయస్సు, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, సన్నని శరీరాకృతి, చామన చాయ చర్మవర్ణం కలిగి ఉంటాడు. తలపై నల్లటి జుట్టుతో పాటు కొంత బట్టతల, నెరిసిన మీసం, చిన్న గడ్డం ఉన్నాయి. అలాగే లేత రంగు గీతలతో కూడిన పూర్తి చేతుల షర్టు ధరించి ఉన్నాడు.ఈ ఆనవాళ్లతో ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాలు గానీ, బంధువుల సమాచారం గానీ ఎవరికైనా తెలిస్తే వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్లో సంప్రదించి సమాచారం అందించాలని తిరుపతి జిల్లా రేణిగుంట మండల పోలీసులు కోరారు.
