- స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసులపై సమగ్ర పరిశీలన. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు……
- మహిళలకు సంబంధించిన కేసుల్లో తక్షణ స్పందనతో బాధితులకు సహాయం అందించాలని సూచనలు.
రేణిగుంట మే 20
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీశారు.
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, నేర నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు భద్రతాభావం కలిగేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యల విషయంలో అలసత్వం ప్రదర్శించకుండా తక్షణ స్పందనతో బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి చట్టపరమైన చర్యలు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు,సీఐ జయచంద్ర,ఎస్ఐ ధర్మారెడ్డి లు చలపతి, ఏఎస్ఐ పార్వతి,కోర్ట్ కానిస్టేబుల్స్ హేమంత్ కుమార్, ఐడి పార్టీ రాజశేఖర్, బారుష,గౌరీ నాయుడు,శీను, త్రినాధ రావు, పాల్గొన్నారు.


