మన ధ్యాస ప్రతినిధి, బుక్కరాయసముద్రం, డిసెంబర్ 6: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని దేవరకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి కొండ పరిసరాల్లో ఇటీవల అరుదైన పునుగు పిల్లులు దర్శనమిస్తూ ఉండటం స్థానికులను ఆశ్చర్యపరిచింది. దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈ జంతువుల సంచారం గత కొన్నిరోజులుగా కనిపించగా, జీవ వైవిధ్య పరిరక్షణ కోణంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. అయితే, ఈ ఆనందాన్ని మసకబార్చుతూ కుక్కల దాడుల కారణంగా పునుగు పిల్లులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. క్రవారం తెల్లవారుజామున కొండపై ఒక పునుగుపిల్లి కుక్కల దాడికి బలై మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో ప్రాంత ప్రజలు, భక్తులు, పర్యావరణ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునుగు పిల్లి ఎంతో అరుదైన జంతువు మాత్రమే కాకుండా, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన పునుగు తైలం ఈ జంతువు నుంచే సేకరించబడుతుందనే విశ్వాసం హిందూ భక్తి సంప్రదాయంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది.“సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్రమైన ఈ దేవరకొండపై ఇలాంటి అరుదైన జాతి జీవాలు సంచరిస్తుండడం ఎంతో శుభపరిణామం. అయితే కుక్కల దాడుల కారణంగా ఇవి నశించిపోవడం తీవ్ర విచారకరం,” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.పునుగుపిల్లి సంరక్షణకు అటవీ శాఖ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించాలని, కొండ చుట్టుపక్కల వదిలేసిన కుక్కల నిర్వహణ, పునుగుపిల్లి ఆవాసాల రక్షణ, మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఈ జంతువులను రక్షించడం జీవ వైవిధ్య పరిరక్షణకే కాకుండా దేవస్థాన పవిత్రత, సాంప్రదాయ పరిరక్షణకు కూడా ఎంతో అవసరమని స్థానికులు ఐక్యంగా అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *