

మన న్యూస్ సాలూరు, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15వేల రూపాయలు చొప్పున అందించిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, డ్రైవర్లకు ఉరితాడు వంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. సిఐటియు జిల్లా కార్యదర్శి, పై సంఘం అధ్యక్షులు ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు, గాంధీ నగర్, వేద సమాజం వీధి, శివాజీ సెంటర్, బోసు బొమ్మ సెంటర్ మీదుగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాహన మిత్ర పథకాన్ని అందజేయాలని నినాదాలు చేసారు. అనంతరం బోసు బొమ్మ సెంటర్ వద్ద కార్మికులను ఉద్దేశించి నాయుడు తోపాటు పలువురు నాయకులు మాట్లాడారు. క్యాబ్ డ్రైవర్లకు నష్టం చేకూర్చే జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలన్నారు. లైసెన్స్ కలిగి ఉన్న నిరుద్యోగులకు ఆటోలు, క్యాబ్ ల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను కూటమి ప్రభుత్వం ఇప్పించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలు చేసి ప్రతి ఒక్కరికి 15వేల రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేసారు. కూటమి ప్రభుత్వం తీరును ఎండగడుతూ గర్జించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల పొట్ట కొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని, మహిళలకు ఉచిత బస్సు కారణంగా తాము నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ ఒక్కొక్కరికి 15వేలు చొప్పున చెల్లించాలన్నారు. వేరు, వేరుగా జరిగిన ర్యాలీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.