మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):
మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.
గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు 80 శాతం పైగా కనెక్షన్లు కలపడంతో దాని సామర్థ్యానికి మించి లోడు పడుతోంది. ఈ సమస్యను అనేకసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.గతంలో అధిక లోడుతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో, దానికి బదులుగా 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ మార్చినా, దానిపైనా అధిక లోడే ఉండడంతో సమస్యలు కొనసాగుతున్నాయి. గ్రామసభలో సమస్యపై చర్చించేందుకు అధికారులు హాజరుకాకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు” అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్‌పై ఉన్న లోడును తగ్గించేందుకు, అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, కొంతమంది వినియోగదారుల కనెక్షన్లు దానికే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
శనివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అధిక లోడ్ వల్ల వైర్లు తెగిపోవడంతో, జేఎల్ఎం సాయికిరణ్ మరమ్మతులు చేశారు. “ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందిస్తారా లేదా?” అన్నది గ్రామస్థుల ప్రశ్న.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *