

మన న్యూస్ ,కోవూరు:- సంపద సృష్టికర్త సీఎం చంద్రబాబు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు పెద్దపీట.- ఎన్నికల మేనిఫెస్టోలో 70% హామీలను ఏడాదిలోనే అమలు చేశారు.- ఏడాది కాలంలో కోవూరులో అభివృద్ధి జాతర.- ఎంపీ వేమిరెడ్డి సహకారంతో జిల్లాకు కంపెనీలు .రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని విపిఆర్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ…….ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అంశాలను వివరించారు. 2024లో జెండా మోసిన నాయకులు, కార్యకర్తల వల్లే ఘన విజయం సాధించామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. ఇటీవల మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైసీపీ నాయకుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొలి ఏడాది కాలంలోనే 70% హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదని వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని మండిపడ్డారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేలు ఉన్న పెన్షన్ ను 4వేలు, 6 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు కే చెందుతుందన్నారు. వెయ్యి పింఛను పెంచడానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో తాము భాగస్వాములు అవుతున్నామని గర్వంగా చెప్పగలమన్నారు. ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశామన్నారు. నిరుద్యోగ యువత కోసం 16 వేల డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని అని చాటారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద వేట నిషేధ సమయంలో ఇచ్చే 10 వేల సహాయాన్ని 20వేలకు పెంచి అందించారన్నారు. జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నారని వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా విధానాన్ని సంపూర్ణంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను బాగు చేసి గుంతలరహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారన్నారు. నమ్మకం పెట్టుకున్న జనాలకు ఆపద్బాంధవులుగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం పేదల నోటికాడి కూడును తీసేస్తే తాము వచ్చిన వెంటనే 200 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఆర్థిక ఒడిదుడుకులతో నడుస్తున్న రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లతో అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలకు రుణాలు ఇచ్చిందన్నారు. గతంలో తాగడానికి నీళ్లు లేవు అనే పరిస్థితి నుంచి పుష్కలంగా నీరు ఉన్న స్థితికి చేరుకున్నామని, ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక గ్రామంలో స్మశానాలు లేవు అన్న సమస్యను గుర్తించామని చెప్పారు. వచ్చే వర్షాకాలంలోపు స్మశానాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం తమదని వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ముదివర్తి కాజ్వేను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి చేస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గానికి ప్రధానమైన కనిగిరి రిజర్వాయర్ ను 40 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఎస్టిమేషన్స్ ఇచ్చామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరులో పంట కాలువల్లో పూడికలు తీయించామని, ప్రస్తుతం కూడా మరొకసారి పూడికలు తొలగిస్తామన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ విభాగాన్ని అస్తవ్యస్తం చేసిందని, దాన్ని సరి చేస్తూ అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామన్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు తీసుకువస్తామని వెల్లడించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బుచ్చి-ఊటుకూరు రహదారికి రూ.49 కోట్ల నిధులు సంపాదించామన్నారు. ఈ ఏడాది కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాకు లక్ష కోట్ల విలువైన బీపీసెల్ కంపెనీని తీసుకువచ్చారని వివరించారు. ఇక విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరులో 200 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్లు అందించామన్నారు. మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశామన్నారు. విపిఆర్ అమృత ధార వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పనగా 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్ ఎస్ ఎమ్ ఈ పార్క్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ పార్కులు ప్రారంభించారన్నారు. త్వరలోనే వితంతు పెన్షన్లను అందజేస్తారన్నారు. అలాగే కొత్తగా రేషన్ కార్డులు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అయ్యిందని, ఇంకా నాలుగేళ్ల పాలన ఉందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో, లోకేష్ ఆలోచనలతో రాష్ట్ర మరింత అభివృద్ధి చెందుతుందని అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని ఆమె స్పష్టం చేశారు.
