

Mana News :- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కులగణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం అని హెచ్చరించారు.