మన ద్యాస, సాలూరు : నిరుపేద గిరిజనులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారని, ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతమంది మృతి చెందటం, ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని, ఇవి ప్రభుత్వ హత్యలుగా చెప్పుకోవచ్చన్నారు. గురు వారం ఉదయం సిపిఎం అనుబంధ సంస్థ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు అనిల్, అఖిల్ ఆధ్వర్యంలో మండలంలోని కురుకూటి, మామిడిపల్లి, ఖరాసువలస గ్రామాల్లో జీపు జాత నిర్వహించారు. అదేవిదంగా ఇటీవల జరిగిన గిరిజన విద్యార్ధుల మరణాలు, వసతి గృహాల్లో సౌకర్యాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం తదితర వివరాలతో కూడిన కరపత్రాలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గిరిజన విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే అన్నారు. వసతి గృహాల్లో వైద్య సదుపాయాలు, ఏఎన్ఎంలు మంచి నీరు తదితర సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్దులు ఆసుపత్రుల పాలవుతున్నారని, కొంతమంది మృతి చెందారన్నారు. కురుపాం గురుకుల పాఠశాలలకు చెందిన అంజలి, కల్పనలు కేజీహెచ్లో మృతి చెందటం తెలిసిన విషయమే అన్నారు. అలాగే కురుపాం, కొమరాడ రామబధ్ర పురాలకు చెందిన – ఈశ్వర రావు, జీవన్ కుమార్, రావి కోన – రాఘవ, కొమరాడ కేజీబీవీ – శారద, గుమలక్ష్మి పురం బాలికల పాఠశాల – అవంతిక, బాలుర పాఠశాల – నితిన్, దినేశ్, తనూజ తదితర గిరిజన విద్యార్దులు అనారోగ్యంతో సరైన వైద్యం అందక మృతి చెందారన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల కంటే జైళ్లే నయమని ఎస్ఎఫ్ఐ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురుకుల పాఠశాలల్లో 611మంది విద్యార్దులకు కేవలం 16గదులే ఉన్నాయని, ఒక గదికి 40మంది విద్యార్దులు ఉండాల్సి వస్తుందని దీన్నిబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థమవుతుందన్నారు. సురక్షితమైన త్రాగు నీరు లేదని, ఉన్న ఆర్ఓ ప్లాంటు మరమ్మత్తులకు గురైతే పట్టించుకొనే నాథుడు లేడన్నారు. ఇక మరుగు దొడ్ల గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. పది మందికి ఒక మరుగు దొడ్డి ఉండాల్సి ఉండగా, 30మందికి ఒకటి ఉందని, చెడు వాసన భరించలేమన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపై వెంటనే దృష్టి సారించాలన్నారు. అదేవిదంగా మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు చెరో 50లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని, అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదన్నారు. ముఖ్యంగా గిరిజన మంత్రి చేసిన మొదటి సంతకం ఏఎన్ఎంల నియామకం తక్షణమే జరపాలని డిమాండ్ చేసారు.కార్యక్రమంలో దివ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.









