మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్), సెప్టెంబర్ 20:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో లాల్ సింగ్ను శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు.సభలో మాట్లాడిన వారు లాల్ సింగ్ తన కృషితో పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించారని,విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచారని కొనియాడారు.పాఠశాల విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో,ఉపాధ్యాయులతో సమన్వయం కల్పించడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు.భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు.సన్మాన కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకట్ రాం రెడ్డి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ హలీమా బేగం,నాయకులు మంద బాల్ రాం,బంగ్లా ప్రవీన్, పోచ గౌడ్,ఎల్లయ్య, తల్లిదండ్రులు అనురాధ, విజయలక్ష్మి,గంగామణి తదితరులు పాల్గొన్నారు.