

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు ఈ రోజు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకూ శంఖవరంలో వాహనాలకు తనిఖీలను నిర్వహించారు. ఓవర్ లోడు, మితిమీరిన వేగం, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో టిప్పర్లు తిరగడాన్ని గుర్తించి ఏడు టిప్పర్లపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను అతిక్రమించి రవాణా చేస్తున్న ఏడు టిప్పర్ లారీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసామని ఎస్సై శ్రీహరిబాబు మీడియాకు తెలిపారు. వీటిని శనివారం కోర్టులో హాజరు పరుస్తామని, ఇంతే కాకుండా తమ తనిఖీలు నిరంతరం కొనసాగు తాయన్నారు. కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై ఈ అక్రమ రవాణా వాహనాల ఆగడాలను నిరోధించాలని కోరుతూ వాటి యజమానుల నియంత పోకడలకు వ్యతిరేకంగా జిల్లా టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు, శంఖవరం జనసేన పార్టీ అధ్యక్షుడు, స్వయం సేవాకర్త మేకల కృష్ణ గత కొంత కాలంగా ప్రజలు పక్షాన పోరాడుతున్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులకు కృష్ణ పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సానుకూల స్పందన కానరాక పోవడంతో చివరకు ప్రజా సమూహాలతో శాంతియుతంగా ధర్నా చేయడానికి గురువారం ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఈ తనిఖీలు చేపట్టారు.